Mahaa Daily Exclusive

  చలాన్ మెసేజ్‌తో……పోలీసు అధికారికి సైబర్ మోసం……..

Share

  • చలాన్ మెసేజ్‌తో
  • పోలీసు అధికారికి సైబర్ మోసం
  • ఆర్టీఏ చలాన్ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేయడంతో రూ. 49 వేలు మాయం
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఎష్ఐ నర్సయ్య

హైదరాబాద్, మహా : సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా, పోలీసు అధికారులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) సైబర్ మోసానికి గురయ్యారు. ఆర్టీఏ చలాన్ పేరుతో వచ్చిన ఒక నకిలీ లింక్‌ను క్లిక్ చేయడంతో, ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 49,139 మాయమయ్యాయి. వివరాల్లోకి వెళితే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నరసయ్య మొబైల్ ఫోన్‌కు జూన్ 8న వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. తన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు గమనించి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతకుముందు ఆర్టీఏ చలాన్‌కు సంబంధించి వచ్చిన ఒక మెసేజ్‌లోని ఏపీకే ఫైల్‌ను ఆయన క్లిక్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, ఆయన బ్యాంకింగ్ వివరాలను తస్కరించి ఖాతాలోని సొమ్మును కాజేశారు. బాధిత ఏఎస్ఐ వెంటనే అప్రమత్తమై సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీకే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్, నకిలీ ఓటీపీల వంటి మోసాలపై హైదరాబాద్ పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నప్పటికీ, సాక్షాత్తు ఒక పోలీస్ అధికారి ఇలాంటి మోసానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది.