Mahaa Daily Exclusive

  రంగంలోకి ఉత్తరాఖండ్ బృందం..!

Share

మూడు రోజులుగా ఆచూకీ కోసం అన్వేషణ ఆగలేదు. 8మంది జాడ కనిపెట్టేందుకు సైన్యం, ఎన్డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్​ఎఫ్, సింగరేణి రెస్యూ బృందాలు అలుపెరుగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ సానుకూలత కనిపించడం లేదు. ఇదీ ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పైకప్పు కూలి ప్రమాద స్థలిలో నెలకొన్న పరిస్థితి. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తుల్లో రెస్క్యూ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిన బృందాలు సైతం పాలుపంచుకుంటున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగలకు చెందిన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు ఏడు సార్లు టన్నెల్‌లో సహాయక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తులలో రెస్క్యూ ఆపరేషన్‌లను విజయవంతంగా పూర్తిచేసిన బృందాలను రంగంలోకి దిగాయి. ఈ బృందంలో దాదాపు 584 నిపుణులైన సిబ్బంది ఉన్నారు. వీరితోపాటు 14 మంది ర్యాట్ హోల్ టీమ్స్‌ సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు. విరిగిన టీబీఎం భాగాన్ని బయటకు తీయాలని రెస్క్యూ టీం భావిస్తోంది. ఐతే ముక్కలైన పరికరాల కారణంగా వెలికితీతకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. బురదనీరు తొలగింపు తర్వాతే ప్రమాదస్థలికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. టన్నెల్‌లలో ఉన్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు స్నిప్పర్ డాగ్స్​లను కూడా రప్పించారు. అయితే, నీరు ఉన్నందున ఈ స్నిప్పర్ డాగ్స్ లోపలికి వెళ్లలేక పోయాయి. ఇప్పటికే డ్యామేజి అయిన కన్వేయర్ బెల్ట్​కు మరమ్మత్తులు చేపట్టగా టన్నెల్ లోపలికి పై నుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లాలని భావించారు. ప్రతికూల పరిస్థితుల వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనను తోసిపుచ్చారు. 5 గ్యాస్ కట్టింగ్ మిషన్లు రేయింబవళ్లు పని చేస్తున్నాయి.

క్షేమంగా రావాలని :
ఎస్​ఎల్​బీసీ సొరంగం వద్ద చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు నిర్విరామంగా అలుపెరగకుండా కొనసాగుతున్నాయి. 8 మంది ఆచూకీ కోసం ఎన్డీఆర్​ఎఫ్ బృందాలతో పాటు పలు రెస్య్యూ సిబ్బంది క్షణం తీరక లేక చర్యలు చెపట్టాయి. సొరంగంలో చిక్కుకున్న వారి కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. తమ సోదరుడు టన్నెల్‌ చిక్కుకుపోయిన విషయం తెలియగానే షాక్‌ గురయ్యామని ఓ కార్మికుడి సోదరుడు అరవింద్ సాహు ఆవేదన చెందుతున్నాడు. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా సంస్థలో తన సోదరుడు విధులు నిర్వహిస్తున్నాడని ఇంతలో సొరంగంలో చిక్కుకోవడంతో క్షేమంగా రావాలని ఆకాంక్షిస్తున్నారు.