ఢిల్లీ, మహా : ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ ఆరున ఢిల్లీలో వరుస బాంబుపేలుళ్లు జరపాలని డాక్టర్ల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తేలింది. ఆరు దశల్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు 32 కార్లను సిద్ధం చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఎర్రకోట పేలుళ్లలో మరణించిన కారుతోపాటు పేలిపోయిన డాక్టర్ ఉమర్ నబీ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని మేవాట్కు చెందిన అల్–ఫలాహ్ యూనివర్సిటీలో లభ్యం కావడంతో ముష్కరుల ప్లాన్ బెడిసి కొట్టింది. ఎర్రకోట పేలుళ్లు, కారులో డాక్టర్ ఉమర్ నబీ డీఎన్ఏ లభ్యం కావడం, అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉమర్ కారు ప్రత్యక్షమవ్వడంతో దర్యాప్తు సంస్థలు ఈ యూనివర్సిటీనే ఉగ్రవాదలు తమ కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో జాతీయ భద్రతా సంస్థలు పేలుళ్ల కేసును ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా.. 32 కార్లతో దేశ వ్యాప్తంగా దాడులకు పాల్పడేందుకు కుట్ర జరిపిన ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుమానిత కార్లను గుర్తించేందుకు పోలీసులు,కేంద్ర భద్రతా బలగాలు సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఫరీదాబాద్లో అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలోని తన అద్దె ఇంట్లో పేలుడుపదార్థాలను దాచిపెట్టేందుకు ఉగ్రవాదులకు సాయపడిన ఇస్లాం మతబోధకుడు, మౌల్వీ ఇష్తియాఖ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మౌల్వీ తరచూ అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అలా ఉమర్, ఘనీసహా పలువురు వైద్యులు, విద్యార్థుల మెదళ్లలోకి ఉగ్రభావజాలాన్ని నింపినట్లు తేలింది.
ఐఈడీల తయారీ
మౌల్వీ సాయంతో ఉగ్రమూకలు 200 ఐఈడీల తయారీలో ఉగ్రమాడ్యూల్ సభ్యులు గతంలోనే మునిగిపోయారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియాగేట్, కాన్సిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, గురుగ్రామ్, ఫరీదాబాద్సహా దేశంలోని కీలక ఎయిర్పోర్ట్లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ వద్ద పేలుళ్లు జరపాలని భారీ ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అమ్మోనియం నైట్రేట్తోపాటు ఒక కొత్తతరహా రసాయనం అశేషాలను పోలీసులు గుర్తించడంతో దేశ వ్యాప్తంగా ఉగ్రకుట్రను భగ్నం చేశారు.








