- ప్రాణాలు తీసిన చైనా మాంజా
- గొంతు తెగి వ్యక్తి స్పాట్ డెడ్!
సంగారెడ్డి, మహా : సంక్రాంతి వేళ రంగురంగుల గాలిపటాలు ఎగురవేయడం అందరికీ సరదాగా ఉంటుంది. కానీ, ఆ గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించే ‘చైనా మాంజా’ మాత్రం ప్రాణాల మీదకు తెస్తోంది. దీని వల్ల చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల నిజామాబాద్లో చైనా మాంజా కారణంగా ఓ బాలుడికి తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అతడికి 20 కుట్లు పడ్డాయి. ఇదే కాకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి ప్రాణాల మీదికి తెచ్చింది. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ నాగరాజు.. చైనా మాంజా కారణంగా గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతాలు మరువకముందే.. చైనా మాంజా కారణంగా సంగారెడ్డి జిల్లాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది.
వ్యక్తి స్పాట్ డెడ్
చైనా మాంజా కారణంగా మరో ప్రాణం పోయింది. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన అవిదేశ్ (35) అనే వ్యక్తి బైక్పై ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఫసల్వాది ప్రాంతం వద్ద అవిదేశ్ మెడకు చైనా మాంజా చుట్టుకుంది. బైక్పై వేగంగా వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకోవడంతో అతడి గొంతు తెగింది. దీంతో అవిదేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.








