- నటి ప్రత్యూష మృతి కేసు
- నిందితుడు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు
- సిద్ధార్ధరెడ్డికి నాలుగు వారాల గడువు
- హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మహా : టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. 2002 ఫిబ్రవరిలో అంటే దాదాపు 24 ఏళ్ల కిందట నటి ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు విధించిన రూ.50 వేల జరిమానా కట్టాలని సైతం పేర్కొంది.
రెండున్నర దశాబ్దాల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ప్రత్యూష తల్లి సుమారు 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఈ రోజు (ఫిబ్రవరి 17, 2026) సుప్రీంకోర్టు ఈ కేసులో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి విధించిన శిక్షను ఖరారు చేస్తూ, నాలుగు వారాల్లోగా సంబంధిత అధికారుల ముందు లొంగిపోవాలని జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
నటి ప్రత్యూష ప్రస్థానాన్ని పరిశీలిస్తే, భువనగిరికి చెందిన ఆమె 1998లో రాయుడు సినిమాతో వెండితెరకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్డమ్ సంపాదించుకున్నారు. అయితే, కెరీర్ ఎదుగుతున్న దశలోనే 2002 ఫిబ్రవరి 24న కేవలం 20 ఏళ్ల వయసులో ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అప్పట్లో దుమారం రేపింది. ఫిబ్రవరి 23న ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి విషం తాగి ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ ప్రత్యూష చనిపోయారు. సిద్ధార్థ రెడ్డి మాత్రం కోలుకుని మార్చి 9న డిశ్చార్జ్ అయ్యారు. అతడే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ కు వెళ్లడంపై అనుమానాలు ఉన్నాయి.
రెండేళ్లు జైలుశిక్ష విధించిన హైకోర్టు
ప్రత్యూష మృతి కేసు ప్రారంభం నుండి అనేక మలుపులు తిరిగింది. ఇది కేవలం ఆత్మహత్య కాదని, ఆమెపై సామూహిక లైంగిక దాడి జరిగిందని, దీని వెనుక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారని ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆరోపించారు. కుమార్తె మరణానికి కారకులకు శిక్ష పడాలని సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. తొలుత ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ, ఇది ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనగా పేర్కొంటూ సిద్ధార్థ రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2004లో సెషన్స్ కోర్టు ఆయనకు ఐదేళ్ల శిక్ష విధించగా, 2011లో హైకోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది.
న్యాయం కోసం సుప్రీంకోర్టుకు..
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అటు సిద్ధార్థ రెడ్డి, ఇటు నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థ, శిక్షను పెంచాలని సరోజినీదేవి దాఖలు చేసిన పిటిషన్లపై గత ఏడాది నవంబర్లో వాదనలు పూర్తియ్యాయి. అయితే తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం ప్రత్యూష కేసులో తుది తీర్పు ఇచ్చింది. నిందితుడు 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశిస్తూ, జరిమానా చెల్లించాలని పేర్కొంది. గత 24 ఏళ్లుగా సాగుతున్న ఈ మిస్టరీ కేసులో బాధితులకు న్యాయం లభించింది.







