Mahaa Daily Exclusive

  ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కల్లోలం….

Share

ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కల్లోలం.
* అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ. *ఎబోలా ముప్పుపై భారత ఆరోగ్య శాఖ ముందస్తు నిఘా.
* ఆందోళన వద్దు, అప్రమత్తతే ముఖ్యం అంటున్న వైద్య నిపుణులు.
* విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, నిఘా వ్యవస్థలను పటిష్టం చేసిన కేంద్రం.
ఢిల్లీ, మహా.
ఆఫ్రికా ఖండంలోని కాంగో, ఉగాండా సహా పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి మరోసారి తీవ్రరూపం దాల్చడం ప్రపంచ ప్రజారోగ్య వర్గాల్లో ఆందోళనలను రేకెత్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి ముందస్తుగా అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ ఉనికిని, దాని వ్యాప్తిని తాము నిశితంగా గమనిస్తున్నామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోకి ఈ ప్రాణాంతక వ్యాధి ప్రవేశించకుండా ఉండేందుకు అవసరమైన అన్ని నిఘా చర్యలను ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ముఖ్యంగా జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ కారణంగా ఇప్పటివరకు 90 మంది ప్రాణాలు విడిచారు. దీనికి తోడు మరో 300కు పైగా ఎబోలా అనుమానిత కేసులు నమోదు కావడంతో పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగింది. ఈ సంక్షోభాన్ని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటిస్తూ ఆదివారం నాడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ మోడ్‌లోకి వెళ్లి, దేశంలో ఏదైనా ఎబోలా అనుమానిత కేసు గుర్తిస్తే వెంటనే స్పందించేందుకు వీలుగా సంసిద్ధత, విమానాశ్రయాల స్క్రీనింగ్ యంత్రాంగాలు, మరియు తక్షణ ప్రతిస్పందన వ్యూహాలను సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం దేశంలో ఎబోలా వ్యాప్తి లేనప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణాలు, ప్రపంచ దేశాల మధ్య ఉన్న నిరంతర అనుసంధానం కారణంగా భారత్ ఇలాంటి అంటువ్యాధుల ముప్పు పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిల్లీలోని ఎయిమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం మన దేశానికి ఎబోలా ముప్పు తక్కువగానే ఉందన్న ఆయన, గతంతో పోలిస్తే దేశంలో పటిష్ఠమైన విమానాశ్రయ స్క్రీనింగ్ వ్యవస్థలు, వ్యాధి నిఘా యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అయినప్పటికీ ప్రపంచంలో ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలితే అవి దేశంలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి, ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ మహమ్మారి లాగా ఎబోలా గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాదని, ఈ వైరస్ ప్రధానంగా వ్యాధి సోకిన వారి శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం వల్ల, అలాగే అసురక్షిత ఖనన పద్ధతుల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. సరైన రక్షణ చర్యలు పాటించకపోతే రోగులకు చికిత్స అందించే ఆరోగ్య కార్యకర్తలు, కుటుంబ సంరక్షకులకు (ఫ్యామిలీ కేర్‌గివర్స్) ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
మరోవైపు, కొవిడ్-19 మహమ్మారి తర్వాత భారతదేశ ఆరోగ్య రక్షణ సన్నద్ధత గణనీయంగా మెరుగుపడిందని మేదాంత ఆస్పత్రిలోని ఇంటర్నల్ మెడిసిన్, రెస్పిరేటరీ విభాగాధిపతి డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పుడు బలమైన ప్రయోగశాలల (ల్యాబొరేటరీల) నెట్‌వర్క్‌లు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు బలంగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ అకారణంగా వచ్చే జ్వరం, తీవ్రమైన రక్తస్రావ లక్షణాలతో వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు చికిత్స అందించేటప్పుడు ఆస్పత్రులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎబోలా వ్యాప్తి గురించి భారతీయులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. సాధారణ స్పర్శ, బహిరంగ ప్రదేశాల్లో తిరగడం లేదా సాధారణ ప్రయాణాల వల్ల ఎబోలా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అయితే, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా వైద్య పరీక్షలు చేయాలని, అనుమానిత రోగులను వేగంగా వేరుచేసి ఐసోలేట్ చేయాలని చెప్పారు. అలాగే చికిత్స అందించే ఆరోగ్య కార్యకర్తలు తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.
వైద్య నిపుణుల సమాచారం ప్రకారం, ఎబోలా వైరస్ ప్రాథమికంగా గబ్బిలాల నుంచి మనషులకు సోకుతుంది. ఆ తర్వాత ఈ వైరస్‌ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు, రక్తాన్ని ఇతరులు తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రాణాంతకమైన ఎబోలా వైరస్‌ సుమారు 21 రోజులపాటు రోగి శరీరంలో సజీవంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో జ్వరం, విపరీతమైన అలసట, నీరసం, కండరాల నొప్పి, తీవ్రమైన తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి మరియు చర్మంపై దద్దుర్లు రావడం వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరిన కొద్దీ శరీరంలోని అంతర్గత అవయవాలైన మూత్రపిండాలు, కాలేయ పనితీరు దెబ్బతినడం వంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని వైద్యులు వివరిస్తున్నారు. ఈ లక్షణాల పట్ల నిఘా ఉంచడం ద్వారా వ్యాధిని ముందే గుర్తించవచ్చని ఆరోగ్య శాఖ పేర్కొంది.