ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అన్నదాతలందరికీ శుభవార్త వినిపించింది.
రైతు భరోసా అమలుకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా తాజాగా మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. దీనికి సంబంధించిన జీవో తెలుగులో విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఈ జీవోను విడుదల చేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ఇదివరకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో దీన్ని అమలు చేస్తామని రేవంత్ సర్కార్ ఇదివరకే స్పష్టం చేసింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది.
అర్హులైన రైతాంగానికి సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామంటూ ఇదివరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి రైతుకు సంక్రాంతికి రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా అన్నారు.
సంక్రాంతి పండగ నాటికి దీనికి అవసరమైన విధి విధానాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి- కిసాన్ పథకం విధి విధానాలను కూడా సభ ముందుంచామని పేర్కొన్నారు. వీటన్నింటిపైనా చర్చించి, విలువైన సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభకు విజ్ఞప్తి చేశారు అప్పట్లో.
1. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయం మొత్తాన్ని సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలకు పెంపు.
2. భూభారతి (ధరణి) పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం, ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించడం, వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయించింది.
3. రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్ఓఎఫ్ఆర్) పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులు.
4. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రైతుభరోసా మొత్తం అన్నదాతల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం.
5. రైతు భరోసా పథకం అమలు వ్యవహారాలను వ్యవసాయ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు.
6. హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
7. జిల్లాలకు సంబంధించి రైతు భరోసా పథకం అమలు, ఫిర్యాదులను పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగింత.








