అధికారంలోకి వస్తే విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఏడాది పాటు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువ ఉడాన్ యోజన కింద నిరుద్యోగులకు ఈ ఆర్థిక సాయం చేయడమే కాకుండాగ, వారి నైపుణ్యాలకు అనుగుణంగా కంపెనీలలో పనిచేసేలా చేస్తామని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఇది ఇంట్లో కూర్చునే వారికి కాదని, వారి నైపుణ్యాలు ప్రదర్శించినవారికి డబ్బులు ఇస్తామని తెలిపింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ ఆదివారం ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగులు వారి శిక్షణ పొందిన రంగంలో పనిలో చేరేలా ప్రయత్నిస్తామన్నారు. తద్వారా వారు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలరని సచిన్ పైలట్ అన్నారు. ఇప్పటికే పలు జానాకర్షణ పథకాలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్యారీ దీదీ యోజన కింద మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని జనవరి 8న హామీ ఇచ్చింది. ‘జీవన్ రక్షా యోజన’ కింద రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా, 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న దిల్లీలో పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కింపు ఉంటుంది.








