అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకార నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందే జైశంకర్ యూఎస్ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టం చేసింది. జైశంకర్ కేవలం ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే అమెరికాకు వెళ్లడంలేదని, ఈ సందర్భంగా అమెరికా నూతన పాలకవర్గంతో ఆయన చర్చలు కూడా జరపనున్నారని వెల్లడించింది. అదేవిధంగా ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ఇతర దేశాల అధినేతలతో కూడా జైశంకర్ చర్చించనున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే… ఇటీవలే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయన ఎన్నికను ఈ నెల 6న అమెరికన్ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు 312 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, డెమోక్రాట్స్ అభ్యర్థి, ఆమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్కు 226 ఓట్లు వచ్చాయని వెల్లడించింది.








