Mahaa Daily Exclusive

  ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు…..!

Share

దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. కుటుంబ సమేతంగా వెళుతున్న ఆయన.. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఇతర ముఖ్య నాయకులూ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలోనే ఉంటున్న సీఎం రేవంత్‌.. కేంద్రమంత్రులను కలిసి వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు. కేంద్రమంత్రులను కలిసేటప్పుడు ఆయా శాఖల మంత్రులూ సీఎం వెంట ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులంతా బుధ, గురు వారాల్లో ఢిల్లీలోనే ఉంటున్న నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలనూ కలిసి మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్‌ పదవుల భర్తీ వంటి అంశాలపైనా చర్చించేందుకు అవకాశముందని వెల్లడించాయి. అనంతరం గురువారం (ఈ నెల 16వ తేదీ) రాత్రి.. కుటుంబ సమేతంగా సీఎం సింగపూర్‌కు బయలుదేరి వెళ్తారు. ఆయన అక్కడి స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సందర్శించనున్నారు. కాగా, దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌ రెడ్డి పాల్గొన్నారు.