తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 4వ తేదీ ప్రత్యేకంగా జరుగనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. 11 గంటలకు కుల గణన సర్వేను సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే దీని కంటే ముందే బీసీ కులగణనపై ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే కులగణన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనపై చర్చించనుంది. దీని కోసం ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తోంది. ఇప్పటికే కేబినెట్ సబ్కమిటీకి ప్లానింగ్ కమిషన్ అధికారులు కులగణన నివేదిక అందజేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచడం కోసం కీలక నిర్ణయం తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించి, ఆ తర్వాత కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. కులగణన సర్వేలో బీసీలు మైనారిటీలతో కలుపుకుని 56.33 శాతం ఉన్నట్లు సబ్కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం పథకాలు, రిజర్వేషన్ల అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. దీని కోసం న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వేషన్లు అమలు చేయడానికి రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి బీసీల కోటా 40 శాతం పెంచుతామని చెప్పారు. దానికి అనుగుణంగానే 50 రోజుల పాటు కులగణన సర్వే చేయించారు. మొత్తం లక్షా 3,889 మంది అధికారులు సర్వే చేశారు. తెలంగాణలో 96.9శాతం కుటుంబాలు ఉన్నట్లు నివేదికలో తేల్చారు. ఈ సర్వేలో 3 కోట్ల 54 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు. 3.1శాతం సర్వేలో వివరాలు నమోదు చేయించుకోలేదని నివేదికలో కమిటీ తెలిపింది. అసెంబ్లీలో కులగణనపై చర్చించిన తదుపరి సభ ఆమోదం తెలపనుంది.
15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
మరోవైపు ఈనెల 15లోగా గ్రామపంచాయతీ, మండల. జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఈ విషయం ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలకు అందరూ సిద్దంగా ఉండాలని కోరారు.
..








