వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మనసు మార్చుకున్నారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారా? ఏపీ నుంచి బెంగుళూరుకు మకాం మార్చాలని ఆయన నిర్ణయం తీసుకున్నారా? పదేపదే బెంగుళూరు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది? ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కాదు? మరి బెంగుళూరు ఎందుకు వెళ్లినట్టు? రాజకీయ వ్యవహారాలా? లేక బిజినెస్ పనులా? వీటిపైనే వైసీపీ నేతలు చర్చించుకోవడం మొదలైంది.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వచ్చే సోమవారం (22న) నుంచి ప్రారంభంకానున్నాయి. కేవలం ఐదు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. నేతలు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ముందుగా విషయాన్ని బయటపెట్టారని అంటున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను లేవనెత్తాలని భావిస్తున్నారట జగన్. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారన్నది నేతల మాట. జగన్తోపాటు మిగతా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా జగన్ చర్చల్లో పాల్గొంటారు. మరి ఆయనకు తగినంత సమయం అధికార పార్టీ ఇస్తుందా? అన్నదే అసలు పాయింట్. లేదంటే తన నియోజకవర్గం సమస్యలను ఆయన ప్రస్తావించే అవకాశముంది.
అసెంబ్లీలో జగన్ వ్యూహం ఎలా ఉండబోతోందనే అందరిలోనూ ఆసక్తిగా మారింది. ఇన్నాళ్లు మాదిరిగా ఆవేశంగా మాట్లాడే ఛాన్స్ జగన్కు లేదు. కౌంటర్ ఇచ్చేందుకు సీనియర్ నేతలు ఉంటారు. మరోవైపు జగన్ అసెంబ్లీకి రావడం డౌటేనని అంటున్నారు. సమావేశాలకు తక్కువ సమయం ఉండడంతో కష్టమేనని అంటున్నారు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా సమావేశాలకు హాజరుకారని అంటున్నారు. సమావేశాలు తర్వాత మళ్లీ బెంగుళూరు వెళ్లిపోవాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
సోమవారం బెంగుళూరుకి వెళ్లిన జగన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రాత్రి వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. జగన్ రాకను తెలుసుకున్న ఆయన అభిమానులు కనిపించడంతో వెంటనే కారు ఆపి వాళ్లతో మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పగటి వేళ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి యలహంక ప్యాలెస్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.








