- మామునూరు ఎయిర్పోర్టుకు భూమి అప్పగించడం
- చరిత్రలో నిలిచిపోయే రోజు
- అదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్టులను త్వరితగతన పూర్తి చేయాలి
- బేగంపేట సభలో
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మహా: ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే మామునూరు ఎయిర్పోర్ట్ కు అవసరమైన భూమిని సేకరించి కేంద్ర విమానయాన శాఖ కు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ కు అవసరమైన 300 ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు గురువారం బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లో ఏర్పాటు చేయదలచిన ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్రమంత్రికి డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తి కేంద్రంలో వైమానిక శాఖ మంత్రిగా ఉండడం అభినందనీయమని వారు తెలంగాణ రాష్ట్ర అవసరాలను గుర్తిస్తూ సహకారం అందించాలని కోరారు. 2007లోనే ఎయిర్పోర్ట్ అథారిటీతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నప్పటికీ గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు పట్టించుకోకపోవడంతో వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. హైదరాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని టూ టైర్ సిటీలు అయినా కొత్తగూడెం ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రామ్మోహన్ నాయుడును రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కోరగా వారు సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లడం శుభసూచకం అని తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ 1930లో నిజాం కాలంలోనే పనులు మొదలుపెట్టారని ఇది ఆనాడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని డిప్యూటీ సీఎం తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణకు 300 కోట్లు అవసరమని గుర్తించి వాటిని వెంటనే విడుదల చేసి వడివడిగా అడుగులు వేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.








