Mahaa Daily Exclusive

  కేటీఆర్ సన్నిహితులే కాంగ్రెస్‌లో చేరతారు.. మహేశ్ కుమార్ గౌడ్ సంచలనం..

Share

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఆగలేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆయన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో, ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఖర్గే నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

 

అనంతరం అక్కడే రాహుల్ గాంధీతో 10 నిమిషాలపాటు సమావేశమయ్యారు మహేశ్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. పార్టీ పరంగా తాను ఎన్నికయిన 50 రోజుల పాటు జరిగిన పలు ముఖ్యమైన రాజకీయ కార్యక్రమాల వివరాలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 

తెలంగాణ కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల చేరికలు ఆగలేదని, కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలు, నేతలు తమతో టచ్‌లో ఉన్నారని మహేశ్కుమార్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత.. కొత్త నాయకత్వం సమన్వయం చేసుకుని పనిచేయాలన్న మహేశ్కుమార్గౌడ్.. కొంతమంది ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తామని తెలిపారు. కొత్త పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పడుతుందన్నారు.

 

మరోవైపు బీఆర్ఎస్పార్టీ తీరు, గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేటీఆర్ చేసిన తప్పులకు పదేళ్ల జైలు కూడా తక్కువేనని తీవ్రంగా స్పందించారు. నిరసనల పేరిట మాజీమంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌లు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మహేశ్‌ కుమార్ గౌడ్ విమర్శించారు. అన్ని పార్టీల ఎన్నికల అజెండాల్లోనూ మూసీ ప్రక్షాళన ఉందని, మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఒక్క పేదవాడి ఇళ్లు కూడా కూల్చలేదని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ విషయంలో విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. హైడ్రా, మూసీ విషయంలో ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మహేశ్ కుమార్ మండిపడ్డారు. దుబాయ్, సింగపూర్ నుంచి సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్నారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం బాంబు పేలుస్తారో వేచి చూడాలన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవన్నారు. తెలంగాణలో కుల గణన చేపడతామన్నారు.

Latest