Mahaa Daily Exclusive

  నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ .. కీలక సూచనలు..

Share

పదవులు పొందిన నేతలు జనసేన పార్టీ ప్రతినిధులుగానే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా వ్యవహరించాలని పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులతో శనివారం తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ కల్యాణ్.. వారికి కీలక సూచనలు చేశారు. పదవులు పొందిన నాయకులు పది మందినీ కలుపుకొని వెళుతూ సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయాలన్నారు.

 

పార్టీని మరింతగా ప్రజలకు దగ్గరయ్యేలా కృషి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోటోకాల్ మర్చిపోవద్దని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు తగిన గౌరవం ఇస్తూ, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని చెప్పారు. అవినీతి లేకుండా పని చేయాలని సూచించారు. నాయకులు ఎవరైనా మీడియా వద్ద వ్యక్తిగతంగా మాట్లాడవద్దని, పాలసీలపైనే చర్చ చేయాలని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పవన్ కోరారు.

 

ఈ సందర్భంలో నామినేటెడ్ పదవులు పొందిన అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), టీటీడీ బోర్డు సభ్యులు బి. మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బి. అనందసాయి తదితరులు పాల్గొన్నారు.