Mahaa Daily Exclusive

  ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో 20.6 శాతం భారీ వృద్ధి….

Share

ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో 20.6 శాతం భారీ వృద్ధి.
*రూ. 91.97 లక్షల కోట్లకు చేరిన ఆస్తి-అప్పుల పట్టీ.
*దేశీయ పెట్టుబడులు, పసిడి నిల్వలు పెరగడమే ప్రధాన కారణం.
* కేంద్ర ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్ల రికార్డు డివిడెండ్.
ముంబై, మహా.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆస్తి-అప్పుల పట్టీ (బ్యాలెన్స్ షీట్) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. దేశీయ పెట్టుబడులు, పసిడి నిల్వలు, విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడంతో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం ఏకంగా 20.6 శాతం వృద్ధితో రూ. 91.97 లక్షల కోట్ల మార్కుకు చేరింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన తన వార్షిక నివేదికలో కేంద్ర బ్యాంక్ ఈ సంచలన వివరాలను వెల్లడించింది. దీనితో పాటు, కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ. 2.87 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ను (మిగులు నిధులు) ఆర్బీఐ ప్రకటించింది.
తాజా నివేదిక ప్రకారం, 2026 మార్చి 31 నాటికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్, అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ. 15.72 లక్షల కోట్ల మేర పెరిగింది. గత ఏడాది ఇదే సమయానికి బ్యాలెన్స్ షీట్ మొత్తం విలువ రూ. 76.25 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (FY25) నాటి వృద్ధిరేటు 8.2 శాతంతో పోలిస్తే తాజా వృద్ధి అత్యంత గణనీయమైనది కావడం గమనార్హం. ఈ అసాధారణ వృద్ధితో ప్రస్తుతం ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం దేశ మొత్తం జీడీపీలో 26.4 శాతానికి సమానంగా నిలిచింది.
ఈ రికార్డు స్థాయి వృద్ధికి దారితీసిన ప్రధాన కారణాలను కూడా ఆర్బీఐ తన నివేదికలో స్పష్టంగా వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ పెట్టుబడులు 44.9 శాతం, పసిడి నిల్వలు 63.8 శాతం, విదేశీ పెట్టుబడులు 7.9 శాతం మేర పెరిగాయి. దీనివల్ల ఆర్బీఐ మొత్తం ఆస్తులలో దేశీయ ఆస్తుల వాటా గతేడాది ఉన్న 25.7 శాతం నుంచి 29.1 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో విదేశీ ఆస్తుల వాటా 74.3 శాతం నుండి 70.9 శాతానికి తగ్గింది. విదేశీ ఆస్తుల కంటే దేశీయ ఆస్తులు వేగంగా వృద్ధి చెందడాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
మరోవైపు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా రూ. 1.09 లక్షల కోట్లను కంటింజెన్సీ ఫండ్‌కు (అత్యవసర నిధి) బదిలీ చేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి లభించనున్న రూ. 2.87 లక్షల కోట్ల రికార్డు స్థాయి డివిడెండ్, ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వానికి ఎంతగానో దోహదపడనుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్బీఐ ఆస్తుల పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 63.45 లక్షల కోట్లుగా ఉన్న బ్యాలెన్స్ షీట్, 2024లో రూ. 70.47 లక్షల కోట్లకు, 2025లో రూ. 76.25 లక్షల కోట్లకు పెరిగి, ఇప్పుడు ఏకంగా రూ. 91.97 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.