Mahaa Daily Exclusive

  వర్చువల్ కుదరదు…

Share

  • వర్చువల్ కుదరదు
  • కోర్టుకు హాజరు కావాల్సిందే
  • అల్లు అర్జున్‌కు న్యాయస్థానం ఆదేశం

హైదరాబాద్, మహా : సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో విచారణకు ఆన్ లైన్ ద్వారా హాజరవుతానన్న బన్నీ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ముంబైలో షెడ్యూల్ జరుగుతోంది. భద్రతా కారణాలు, మూవీ షూటింగ్ నేపథ్యంలో వర్చువల్ (ఆన్ లైన్) ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని బన్నీ నాంపల్లి కోర్టును అభ్యర్థించారు. అయితే, అలా కుదరదని కచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది న్యాయస్థానం. దీంతో ఆయన సోమవారం బన్నీ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏ11గా బన్నీ

ఈ కేసులో బన్నీని పోలీసులు ఏ11గా చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకూ నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఇప్పటివరకూ 23 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మొత్తం 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. 2024, డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అభిమానులతో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లిన బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు యాజమాన్యంతో పాటు బన్నీని కూడా బాధ్యున్ని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత బాధిత కుటుంబానికి అల్లు అర్జున్‌తో పాటు మూవీ టీం అండగా నిలిచింది. బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వైద్య సాయంతో పాటు ఫ్యామిలీకి కూడా సాయం అందించారు.