- గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం
- కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారనున్న నియోజకవర్గాల పునర్విభజన
- విపరీతంగా జనాభా పెరిగిన గ్రేటర్ పరిధి
హైదరాబాద్, మహా : తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అమల్లోకి వస్తే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ స్థానాల సంఖ్య ఏకంగా 179 వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనలు, జనాభా లెక్కల ప్రాతిపదికన ప్రతి నియోజకవర్గానికి సగటున 1.95 లక్షల జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే.. ఈ ప్రక్రియలో అత్యధికంగా లబ్ధి పొందేది, సీట్లను అదనంగా సాధించుకునేది గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉండే మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలే కానున్నాయి.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు విపరీతంగా విస్తరించడం వల్ల గ్రామీణ ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి నగరానికి వలసలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా పటాన్చెరు, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఆరు నుంచి ఏడు లక్షలు దాటిపోయింది. మిగతా జిల్లాల్లోని ఒక సాధారణ నియోజకవర్గంలో 2 నుంచి 2.5 లక్షల ఓటర్లు ఉంటే, హైదరాబాద్ అర్బన్ కారిడార్లోని ఒక్కో స్థానంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండాల్సినంత జనాభా కేంద్రీకృతమైంది. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దడమే డిలిమిటేషన్ ప్రధాన లక్ష్యం కానుంది.
అంచనాల ప్రకారం.. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల ఉమ్మడి అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 29 నుంచి ఏకంగా 45కిపైగా పెరిగే అవకాశముంది. పటాన్చెరు, శేరిలింగంపల్లి, మేడ్చల్, కూకట్పల్లి, మహేశ్వరం వంటి అతిపెద్ద నియోజకవర్గాలను రెండు లేదా మూడు కొత్త సీట్లుగా విభజిస్తారు. దీనివల్ల కేవలం గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల అర్బన్ పరిధిలోనే దాదాపు 16 నుంచి 20 కొత్త అసెంబ్లీ స్థానాలు పుట్టుకొస్తాయి. అంటే, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా గ్రామీణ ప్రాంతాల కంటే ఈ గ్రేటర్ బెల్ట్ సీట్లే అత్యంత కీలకం కానున్నాయి.
రూరల్లోనే కాంగ్రెస్కు ఎక్కువ పట్టు
ఈ స్థానాల పెంపు ఏ పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్ ఇస్తుందనేది ఇప్పుడు అసలు సిసలైన చర్చ. నగర ఓటర్లలో మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులు, ఆంధ్రా మూలాలున్న సెటిలర్లు, ఉత్తరాది వలసదారులు ఎక్కువగా ఉంటారు. చారిత్రాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు మైగ్రెన్ట్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బిజెపి , బిఆర్ఎస్ పార్టీలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. డిలిమిటేషన్ వల్ల నగర సీట్లు పెరిగితే అర్బన్ క్లాస్, సెటిలర్ ఓటర్ల ప్రభావం మరింత పెరిగి బీజేపీ, బీఆర్ఎస్లకు కలిసివచ్చే అవకాశాలు ఎక్కువ . మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గ్రామీణ తెలంగాణలో అత్యంత బలంగా ఉండి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తక్కువ స్థానాలను కలిగి ఉంది. కాబట్టి అర్బన్ సీట్లు భారీగా పెరిగితే కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ గ్రామీణ ఓటు బ్యాంకును మాత్రమే నమ్ముకుంటే సరిపోదని, నగర నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ కొత్త సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. రూరల్ నియోజకవర్గాల్లో కూడా జనాభా ప్రకారం కొత్త స్థానాలు ఏర్పడతాయి కాబట్టి అక్కడ తులనాత్మకంగా కాంగ్రెస్కు పట్టు సాధించే వెసులుబాటు కూడా ఉంటుంది.
పవర్ సెంటర్ అర్బన్ కారిడారే
రాబోయే డిలిమిటేషన్ తెలంగాణ పొలిటికల్ పవర్ సెంటర్ను రూరల్ కారిడార్ నుంచి అర్బన్ కారిడార్కు మళ్లించబోతోంది. ఏ పార్టీ అయితే గ్రేటర్ హైదరాబాద్ విస్తరిస్తున్న నూతన నియోజకవర్గాల్లో పట్టు సాధిస్తుందో, ఆ పార్టీకే రాష్ట్రంలో అధికార పీఠం దక్కే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సామాజిక సమీకరణాలు, వలసదారుల ప్రభావం, ఐటీ-రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణే రేపటి తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.








