Mahaa Daily Exclusive

  ఏపీ ప్రభుత్వం మరో (5000 కోట్లు అప్పు) ప్రయత్నం.

Share

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది.

ఇందులో భాగంగా రుణాలపై ఎక్కువగా ఆధారపడింది.

అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లు/స్టాక్స్‌ను వేలానికి పెట్టే సంప్రదాయాన్ని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కొనసాగిస్తోంది.

ఇప్పటికే దశలవారీగా వేల కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అప్పులకు వెళ్లింది చంద్రబాబు సర్కార్. తాజాగా 5,000 కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. దీనికి అవసరమైన మూడు స్టాక్స్‌ను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టింది.

ఇందులో ఒక స్టాక్ విలువ 2,000 కోట్ల రూపాయలు. మిగిలినవి ఒక్కొక్కటి 1,500 కోట్ల రూపాయలు. ఈ నెల 31వ తేదీన అంటే మంగళవారం నాడు ఈ స్టాక్స్ వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది.

ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 12, మరొకటి- 13, ఇంకొకటి- 14 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కాంపిటీటివ్ విధానంలో స్టాక్‌ను కొనదలిచిన వారు ఈ నెల 31వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 గంటలు, కాంపిటీటివ్ విధానంలో వాటిని కొనదలిచిన వారు అదే తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.

అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం తన సెక్యూరిటీ బాండ్లు/ స్టాక్స్‌ను వేలానికి పెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇదివరకే 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 5,000 కోట్ల రూపాయలను సేకరించదలిచింది.

ఏపీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. హర్యానా- రూ. 1,000 కోట్లు, జమ్మూ కాశ్మీర్- రూ. 320 కోట్లు, కర్ణాటక- రూ. 4,000 కోట్లు, మధ్యప్రదేశ్- రూ. 5,000 కోట్లు, పంజాబ్- 500 కోట్లు, రాజస్థాన్- రూ. 500 కోట్లు, తెలంగాణ- 409 కోట్ల రూపాయల మేర స్టాక్స్‌ను వేలానికి పెట్టాయి.

ఉత్తరప్రదేశ్- రూ. 3,000 కోట్లు, పశ్చిమ బెంగాల్- 2,500 కోట్ల రూపాయల విలువ చేసే స్టాక్స్ వేలానికి వచ్చాయి. మొత్తంగా 24,729 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ స్టాక్స్ వచ్చే మంగళవారం వేలానికి పెట్టనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Latest