కొండచరియల కింద వాహనం.
* హిమాచల్లో 13 మంది దుర్మరణం.
షిమ్లా, మహా.
హిమాచల్ ప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల వాహనంపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు నెలల చిన్నారితో సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు వాహనం నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ గాయాలపాలయ్యారు. ప్రమాదం అనంతరం వాహనం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనాస్థలిలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం లాహౌల్–స్పితి జిల్లాలోని పాంగి–ఉదయ్పూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తుండగా, వారంతా పాంగి లోయ ప్రాంతానికి చెందిన వారేనని అధికారులు తెలిపారు. కొండపై నుంచి భారీ రాళ్లు ఒక్కసారిగా వాహనంపై పడటంతో అది పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం అనంతరం వాహనం వెనుక భాగంలో మంటలు చెలరేగడంతో స్థానికులు, ఆర్మీ సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనపై భర్మోర్ ఎమ్మెల్యే జనక్రాజ్ స్పందిస్తూ, వాహనంలోని 15 మందిలో 13 మంది మృతి చెందారని, ఇద్దరు వాహనం నుంచి బయటకు దూకడంతో ప్రాణాలు దక్కాయని తెలిపారు. చంబా, లాహౌల్–స్పితి డిప్యూటీ కమిషనర్లు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం పాంగి–కిలాద్ రహదారిపై గురువారం కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు పూర్తిచేసి శుక్రవారం ఉదయం మాత్రమే రహదారిని తిరిగి తెరిచారు. ఆ తర్వాత ప్రయాణికులు పాంగి వైపు బయలుదేరిన సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







