Mahaa Daily Exclusive

  బెంగాల్‌లో ‘గుర్తింపు, తొలగింపు, తిప్పివేత’…

Share

బెంగాల్‌లో ‘గుర్తింపు, తొలగింపు, తిప్పివేత’.
* సరిహద్దులకు పోటెత్తుతున్న అక్రమ వలసదారులు.
కలకత్తా, మహా.

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన “డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్” (గుర్తించడం, తొలగించడం, దేశం నుంచి పంపించేయడం) విధానంతో అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు పెద్ద ఎత్తున అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నారు. నార్త్ 24 పరగణాలు, మాల్దా జిల్లాల సరిహద్దుల్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు, రాష్ట్ర ప్రభుత్వ చొరబాటు వ్యతిరేక చర్యలు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా పరిపాలనాపరమైన క్షేత్రస్థాయి చర్యలుగా మారాయని స్పష్టం చేస్తున్నాయి.
నార్త్ 24 పరగణాల జిల్లా బసిర్హత్ సబ్ డివిజన్‌లోని హకీంపూర్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం వందకు పైగా బంగ్లాదేశ్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు గుమికూడారు. వీరంతా బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్నారని, విదేశీ జాతీయుల కోసం ప్రభుత్వం హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన తాజా ప్రకటనల నేపథ్యంలోనే భయాందోళనలతో వీరు సరిహద్దుకు చేరుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇటీవల బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం పరిధిలోకి రాని వారందరినీ చొరబాటుదారులుగా పరిగణించి, రాష్ట్ర పోలీసుల ద్వారా అరెస్ట్ చేసి బీఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తామని తేల్చి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, అక్రమ చొరబాటుదారులను తాత్కాలికంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో ‘హోల్డింగ్ సెంటర్‌’లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. మాల్దా జిల్లాలోని ఇంగ్లీష్ బజార్ పట్టణ పరిధిలో ఉన్న చందన్ పార్క్ వద్ద మొదటి హోల్డింగ్ సెంటర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. గజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండువాలో పట్టుబడిన తొమ్మిది మంది అనుమానిత బంగ్లాదేశీయులను (ముగ్గురు మహిళలు, ఆరుగురు మైనర్లు) ఆదివారం ఈ సెంటర్‌కు తరలించారు. ఇక్కడ సీసీటీవీ నిఘాతో పాటు 12 మంది పోలీసు సిబ్బంది, సివిల్ డిఫెన్స్ మరియు ఇతర సహాయక సిబ్బందితో 24 గంటల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాల్లో అనుమానిత చొరబాటుదారులను గరిష్టంగా 30 రోజుల పాటు ఉంచుతారు. ఈ సమయంలో జిల్లా మేజిస్ట్రేట్లు, సంబంధిత అధికారులు వారి పత్రాలను పరిశీలించి, బయోమెట్రిక్ వివరాలను సేకరించి కేంద్ర డేటాబేస్‌లో నమోదు చేసిన అనంతరం వారిని స్వదేశానికి పంపిస్తారు. ముఖ్యంగా 2025లో అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం.. నిఘా, నిర్బంధం, తిప్పి పంపే ప్రక్రియలకు ఆధునిక సాంకేతికతను జోడించడంతో పాటు, అనుమానితులను ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారాన్ని హెడ్ కానిస్టేబుల్, ఆపై స్థాయి పోలీసు అధికారులకు కల్పించారు.
ఈ సంచలన పరిణామాలు బెంగాల్‌లో చొరబాట్లపై జరుగుతున్న సుదీర్ఘ రాజకీయ చర్చను మరింత తీవ్రతరం చేశాయి. రాష్ట్రం రోహింగ్యాలు, ఉగ్రవాదులు, జిహాదీ మూకలకు కారిడార్‌గా మారిందని, దేశ భద్రత దృష్ట్యా ఈ ఆపరేషన్ అత్యవసరమని బీజేపీ నార్త్ మాల్దా ఎంపీ ఖగెన్ ముర్ము స్వాగతించారు. అయితే 2024 డిసెంబర్ 31 కంటే ముందు అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ మైనారిటీలకు పౌరసత్వ సవరణ చట్టం కింద ఈ చర్యల నుంచి మినహాయింపు ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కట్టుదిట్టమైన భద్రత, హోల్డింగ్ సెంటర్ల నిర్వహణతో పశ్చిమ బెంగాల్ చొరబాటు వ్యతిరేక ప్రచారం రాబోయే వారాల్లో మరింత ఉధృతంగా మారనుందని స్పష్టమవుతోంది.